ఆంధ్రజ్యోతి (23-12-2021)
శీతాకాలం వచ్చింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. కొందరికి చలి ఎక్కువైనప్పుడు కీళ్ల నొప్పులు వస్తాయి. మరి ఈ నొప్పులను ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకుందాం..
చలికాలంలో కీళ్ల నొప్పులు పెరగడానికి కారణమేమిటో ఎవరికీ తెలియదు. అయితే, దీనికి సంబంధించిన వివిధ సిద్ధాంతాలను వైద్య నిపుణులు ప్రతిపాదించారు. చలికాలంలో మన శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసేందుకు రక్తప్రసరణలో కొన్ని మార్పులు వస్తాయని.. దానివల్ల కొన్ని కండరాలు, కీళ్లలో రక్తప్రసరణ తగ్గిపోతుందని.. దానివల్ల ఆయా ప్రాంతాల్లో నొప్పులు పెరుగుతాయని ఒక సిద్ధాంతం. చలికాలంలో శరీరంలోని కీళ్ల వద్ద ఉండే జిగురులాంటి పదార్థం గట్టిపడుతుందని.. దాని వల్ల కీళ్లు బిగుసుకుపోయి నొప్పులు పెరుగుతాయని మరో సిద్ధాంతం. చలికాలంలో సూర్యరశ్మి లేకపోవడం వల్ల విటమిన్ డి లేకపోవడం వల్ల కూడా నొప్పులు పెరుగుతాయని కొందరు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.ఈ నొప్పుల నుంచి తప్పించుకోవడానికి కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. వాళ్ళలో కొందరు..
శరీరానికి చలి రాకుండా పూర్తిగా దుస్తులు ధరించాలి. దీని వల్ల చలి గాలుల వల్ల కీళ్లపై ప్రభావం పడదు, నొప్పి పెరగదు.
క్రమం తప్పకుండా వ్యాయామం. దీని వల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంది.
చలికాలంలో చాలా మంది వ్యాయామం చేయరు. దీనివల్ల బరువు పెరుగుతారు. బరువు పెరగడం వల్ల కీళ్ల నొప్పులు కూడా పెరుగుతాయి. కాబట్టి కీళ్ల నొప్పులతో బాధపడేవారు చలికాలంలో సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఆహారంతో పాటు నీరు ఎక్కువగా తాగాలి. తగినంత నీరు త్రాగకపోవడం కూడా నొప్పికి కారణమవుతుంది.
చలికాలంలో చిప్స్ వంటి జంక్ ఫుడ్ తినకపోవడమే మంచిది. సాధారణంగా ఇలాంటి జంక్ ఫుడ్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కీళ్ల నొప్పులు కూడా పెరుగుతాయి.
ప్రతిరోజూ వేడినీటి స్నానం చేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది.
నవీకరించబడిన తేదీ – 2021-12-23T18:34:01+05:30 IST