యూజీసీ నిబంధనలు పాటించాలన్నారు
వర్సిటీ నియామకాల్లో పారదర్శకత ఉండాలి.
వీలైనంత త్వరగా ఖాళీలను భర్తీ చేయాలి
యూనివర్సిటీల మేలు కోసమే నా తపన..
విద్యాశాఖ మంత్రి సబితతో గవర్నర్ తమిళిసై
తన ఉద్దేశం కూడా అదేనని మంత్రి వివరించారు.
సమావేశం 45 నిమిషాల పాటు కొనసాగింది
హైదరాబాద్ , నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీలో యూజీసీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకత, నిష్పక్షపాతంగా ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని, విద్యార్హతల ఆధారంగా నియామకాలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. యూనివర్సిటీల రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేసేందుకు మంత్రి సబిత గురువారం సాయంత్రం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రి వెంట రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు ఉన్నారు.
యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ బోర్డుకు సాధికారత కల్పించేందుకు యూనివర్సిటీల సవరణ బిల్లును తీసుకొచ్చారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపారు. అయితే ఈ బిల్లును గవర్నర్ ఆమోదించలేదు. దీనిపై కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని విద్యాశాఖ మంత్రి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి గవర్నర్ను కలిసి తన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన వీరి భేటీలో గవర్నర్ పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లుపై వివరణ కోరుతున్నట్లు గవర్నర్ స్పష్టం చేశారు. నియామకాల్లో యూజీసీ నిబంధనలను పాటించడమే కాకుండా యూనివర్సిటీల్లో హాస్టల్, లేబొరేటరీ, లైబ్రరీ సౌకర్యాలు, డిజిటల్ వనరులు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు.
సందేహాలు.. సమాధానాలు..
భేటీలో ఈ బిల్లుపై గవర్నర్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా.. పాత పద్ధతిలో రిక్రూట్మెంట్ చేయవచ్చా? కమిటీల ద్వారా చేయడంలో అభ్యంతరం ఏమిటి? కొత్త బోర్డు ఎందుకు ఏర్పడింది? తాజా నిర్ణయంతో వర్సిటీల స్వయంప్రతిపత్తి దెబ్బతిందా? మీరు UGC మార్గదర్శకాలను అనుసరించారా? తదితర ప్రశ్నలు గవర్నర్ అడిగినట్లు సమాచారం. గతంలో ఉన్న విధానంలో కొన్ని లోపాలున్నాయని, వాటిని అధిగమించేందుకే బోర్డును తీసుకొచ్చామని మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. యూజీసీ మార్గదర్శకాలను పాటిస్తూ యూనివర్సిటీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బోర్డు ద్వారానే నియామకాలు చేపడతామని గవర్నర్కు వివరించారు. అలాగే.. అన్ని వర్సిటీలు సంయుక్తంగా నియామకాలు చేపడితే రిజర్వేషన్లపై ప్రభావం పడుతుందా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టవచ్చని గవర్నర్ వ్యక్తం చేసిన సందేహాలపై మంత్రి స్పందిస్తూ.. బోర్డు ద్వారా జరిగే నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఈ బోర్డు ద్వారా కేవలం బోధనా సిబ్బంది, నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. TSPSC ద్వారా భర్తీ చేయబడుతుంది. ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేసే పరిస్థితి ఏమిటని గవర్నర్ ప్రశ్నించగా.. త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. సమావేశం ముగిశాక.. ‘విశ్వవిద్యాలయాలు బాగుండాలన్నదే నా కోరిక.. బిల్లు వల్ల సమస్యలు రాకూడదు’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఇదే తన ఉద్దేశమని మంత్రి వివరించారు. మొత్తం మీద సభ సజావుగా ముగిసిందని, త్వరలోనే యూనివర్సిటీల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
నవీకరించబడిన తేదీ – 2022-11-11T11:42:56+05:30 IST