-
వర్షాలు.. వరదల తాకిడికి ఉత్తరాది..
-
హరిద్వార్, అలీఘర్, కోటాలో మొసళ్ల వేట
-
రోడ్లపై మొసళ్లు.. నీళ్లలో కార్లు
-
వర్షాలు.. వరదల తాకిడికి ఉత్తరాది..
-
హరిద్వార్, అలీఘర్, కోటాలో మొసళ్ల వేట
-
ఉత్తరాఖండ్లో కొట్టుకుపోయిన వంతెన
-
గుజరాత్లో కార్లు కొట్టుకుపోయాయి
-
జమ్మూకశ్మీర్లో ఏడుగురు మరణించారు
న్యూఢిల్లీ/డెహ్రాడూన్/ముంబై, జూలై 19: భారీ వర్షాలు.. వరదలతో ఉత్తరాది ఉగ్రరూపం దాల్చుతోంది. నదుల్లో ఉండాల్సిన మొసళ్లు రోడ్లపైకి వస్తున్నాయి. రోడ్లపై ఉండాల్సిన కార్లు కొట్టుకుపోతున్నాయి. హిమాలయ-సివాలిక్ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల కారణంగా వీధులన్నీ బురదమయంగా మారుతున్నాయి. కాశ్మీర్ నుంచి మహారాష్ట్ర వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్, లక్సోర్, ఖాన్పూర్లో మొసలి విజృంభించింది. గంగానదికి ఉపనదులైన బంగంగా, సోనాలి నదుల నుంచి మొసళ్లు రోడ్లపైకి వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో డజనుకు పైగా మొసళ్లను పట్టుకుని నదుల్లో వదిలినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. రాజస్థాన్లోని కోటాలో కూడా మొసలి సందడి నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి తల్వాండి ప్రాంతంలో నాలుగు అడుగుల పొడవున్న మొసలి రోడ్డు దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరాఖండ్లోని కాలాపానీ ప్రాంతంలో వరద నీటిలో ఇనుప వంతెన కొట్టుకుపోయింది.
వరద నీటిలో కార్లు
గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజ్కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వివిధ ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 70 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంగళవారం పలుచోట్ల 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గిర్ సోమనాథ్ జిల్లా సూత్రపాడ తాలూకాలో 345 మి.మీ. వర్షపాతం నమోదైనప్పుడు, కార్లు మరియు ఇతర వాహనాలు నీటిపై తేలుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుజరాత్లో వరద ముప్పు ఉన్నందున 43 రిజర్వాయర్లకు హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు, జమ్మూ కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కథువా జిల్లాలోని బని తహసీల్లో కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు కూలిపోయాయని, నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ను నిలిపివేశారు.
ముంబైకి ఆరెంజ్ అలర్ట్
మహారాష్ట్రలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. థానే, పాల్ఘర్ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక్కడ 250 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. థానేలోని సోనివాలి, హెంద్రెపాడలో 200 కుటుంబాలు, కళ్యాణ్ తాలూకాలోని మౌర్యనగర్లో 60 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కళ్యాణ్-కాసర సెక్షన్లో రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. కొంకణ్ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో వరద ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముంబై నగరానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ముంబై, నవీ ముంబైలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వర్షంలో తడుస్తున్న తండ్రి చేతిలో నుంచి 4 నెలల పసికందు కాలువలో పడిన ఘటన కళ్యాణ్-ఠాకూరి రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది.
నవీకరించబడిన తేదీ – 2023-07-20T03:09:38+05:30 IST