గత మూడు నెలల్లో టాప్-10 కంపెనీల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 21,327 తగ్గింది
దేశీయ ఐటీ రంగంలో ప్రస్తుతం ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. భవిష్యత్తు డిమాండ్పై అనిశ్చితి నెలకొంది. దాంతో కంపెనీలు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వ్యయ నియంత్రణపై దృష్టి సారిస్తున్నాయి. కొత్త ఉద్యోగుల నియామకం విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. దాంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో టాప్-10 ఐటీ కంపెనీల్లో (ఆదాయం పరంగా) మొత్తం ఉద్యోగుల సంఖ్య 21,327 మేర తగ్గింది. గతంతో పోలిస్తే ఉద్యోగుల వలసలు తగ్గినప్పటికీ నికర సంఖ్య తగ్గుతుండటం గమనార్హం. గత ఏడాది ఇదే కాలంలో ఈ పది కంపెనీలు నికరంగా 69,634 మందికి ఉపాధి కల్పించాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే గత మూడు నెలల్లో టాప్ టెన్ లో ఉన్న 6 కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గినా నాలుగు కంపెనీల్లో మాత్రం స్వల్ప పెరుగుదల కనిపించింది. నెం.1 ఐటీ కంపెనీ టీసీఎస్ నికర ఉద్యోగులు 523 పెరిగి 6.15 లక్షలకు చేరుకున్నారు. L&T టెక్నాలజీ సర్వీసెస్ (LTTS) 1,159 నికర నియామకాలను చూసింది, పెర్సిస్టెంట్లో 241 మరియు కోఫోర్జ్లో 1,000 మందిని నియమించారు. ఇన్ఫోసిస్ (6,940 మంది), హెచ్సిఎల్ టెక్ (2,506), విప్రో (8,812), టెక్ మహీంద్రా (4,103), ఎల్టిఐ మైండ్ట్రీ (1,808) మరియు ఎంఫిస్సా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గాయి.
మరింత తగ్గవచ్చు..!
ప్రస్తుత త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)తో పాటు మరికొంత కాలం ‘ఐటీ’లో ఉద్యోగుల సంఖ్యను పెంచే అవకాశాలు లేవని కంపెనీలకు మానవ వనరులను అందించే స్టాఫింగ్ కన్సల్టెన్సీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్ నియామకాలపై ఈసారి ఐటీ కంపెనీలేవీ స్పష్టత ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. గత రెండేళ్లలో చాలా ఐటీ కంపెనీలు అవసరానికి మించి రిక్రూట్మెంట్లు చేపట్టాయి. అయితే, ఐటీ కంపెనీల ఆదాయానికి కీలక వనరుగా ఉన్న అమెరికా మార్కెట్ను మాంద్యం ముప్పుతిప్పలు పెడుతోంది. దాంతో ఖాతాదారుల ఐటీ ఖర్చులపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో లాభాలను ఆదా చేసేందుకు కంపెనీలు ఉద్యోగులను తగ్గించడం లేదా ఉన్నవారితో పనులు చేయించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయని సిబ్బంది సేవల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఐటీలో 54 లక్షల మంది ఉద్యోగులు
దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే ప్రైవేట్ రంగంలో ఐటీ ఒకటి. అంతేకాదు, ఐటీ కంపెనీల భవిష్యత్ వ్యాపార వృద్ధి సంకేతాలలో కొత్త ఉద్యోగుల నియామకం కూడా కీలక అంశం. ఉద్యోగుల సంఖ్య తగ్గడం భవిష్యత్ డిమాండ్పై అనిశ్చితికి సంకేతమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో నాస్కామ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశీయ ఐటీ రంగంలో 54 లక్షల మంది పనిచేస్తున్నారు.