టీడీపీ : దూకుడు పెంచిన చంద్రబాబు.. కీలక నేతలతో వరుస భేటీలు

టీడీపీ : దూకుడు పెంచిన చంద్రబాబు.. కీలక నేతలతో వరుస భేటీలు

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. జగన్ ఢిల్లీ వెళ్లి ముందస్తుపై బీజేపీ నేతలతో లాబీయింగ్ చేస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీని జగన్ వేడుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది డిసెంబర్ లోనే ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. ఏపీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు ప్రతి నియోజకవర్గం నుంచి కొందరు నేతలను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు బుధవారం కూడా నాలుగు సీట్ల నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. సంతనూతలపాడు, తిరువూరు, పోలవరం, సూళ్లూరుపేట స్థానాలపై ఆయా నియోజకవర్గాల నేతలతో చర్చించారు. గురువారం మరో మూడు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు.

గతంలో పార్టీ చేసిన సర్వే నివేదికలు, పార్టీ వ్యూహకర్తలు చెప్పిన సమాచారం, ప్రస్తుతం సేకరించిన వివరాల ఆధారంగా అభ్యర్థుల కూర్పుపై చంద్రబాబు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా నియోజక వర్గాల్లో ప్రజల నాడి, క్యాడర్ కు అనుకూలంగా ఉండే నేతలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. గతానికి భిన్నంగా ఈసారి గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. మరోవైపు ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సమాచారంతో చంద్రబాబు ఆరు నెలలుగా పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. నారా లోకేష్ కూడా యువగళం పేరుతో పాదయాత్రలు చేస్తూ అధికార పార్టీ అవినీతి, దుర్మార్గాలను బయటపెడుతున్నారు. పలు చోట్ల టీడీపీ యువనేతలతో కీలక చర్చలు జరుపుతున్నారు. లోకేష్ స్వయంగా ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు.

ప్రస్తుతం వైసీపీపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇటీవల సర్పంచులు కూడా ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అలాగే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయా అంశాలపై దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా నాలుగేళ్ల నరకం పేరుతో వరుసగా వీడియోలు విడుదల చేస్తున్నారు. వైసీపీ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తానికి పార్టీ నేతలను, ప్రజా సమస్యలను సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. నేతల మధ్య అంతరాలను తొలగించి విభేదాలకు చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి టికెట్‌ కన్నా లక్ష్మీనారాయణకు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడంతో కోడెల శివరాం వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే అసంతృప్తులను శాంతింపజేయడంలో టీడీపీ విజయం సాధించింది. కాగా, గత ఎన్నికల్లో నష్టపోయిన నెల్లూరు జిల్లా రాజకీయాలపై టీడీపీ దృష్టి సారించింది. ఈసారి వైసీపీ 10కి 10 సీట్లు గెలుచుకోవడంతో పరిస్థితి వేగంగా మారిపోయింది. ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వంటి నేతలు వైసీపీపై తిరుగుబాటు చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీ మంత్రి నారాయణలకు టిక్కెట్లు ఖరారైనట్లు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ప్రకటించారు. కాగా, ముందస్తు ఎన్నికల వ్యూహంతో దసరా నాటికి సగం మంది అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

నవీకరించబడిన తేదీ – 2023-07-06T13:17:20+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *