టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అర్నేష్ కుమార్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఏపీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అర్నేష్ కుమార్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఏపీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూరు పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అయ్యన్న హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ రెడ్డిపైనా, ఇతర ప్రజాప్రతినిధులపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అయ్యన్న వేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయ్యన్న తరపున న్యాయవాది వివి సతీష్ కోర్టులో వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన ఐపీసీలోని సెక్షన్ 505(2), 153ఏలు పిటిషనర్కు వర్తించవని వాదించారు. అసభ్య పదజాలం ప్రచురించే, ప్రచారం చేసే వారికి 505(2) వర్తిస్తుందని సతీష్ తెలిపారు.
అసలు ఏం జరిగింది..?
ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై ఇలాంటి పదాలు ప్రయోగించవచ్చా..? అని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇలాంటి భాష ఉపయోగించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. అధికార పార్టీ నేతలు పరుష పదజాలం వాడడం వల్లే ఇలాంటి పదజాలం వాడాల్సి వచ్చిందని న్యాయవాది సతీష్ కోర్టుకు వివరించారు. రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారని వాదించారు. అయితే, పిటిషనర్కు అలాంటి పదజాలం అలవాటు ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అనంతరం అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని హైకోర్టు ఆదేశించింది. అనుచిత వ్యాఖ్యల కేసులో కృష్ణా జిల్లా పోలీసులు అయ్యన్న పాత్రను అదుపులోకి తీసుకుని 41ఏ నోటీసులిచ్చి అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్గేట్ వద్ద వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెను దుమారం చెలరేగింది.
నవీకరించబడిన తేదీ – 2023-09-06T18:01:29+05:30 IST