విశాఖపట్నం కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. బెట్టింగ్ లో మోసపోయిన బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి సుమారు రూ.367 కోట్ల బెట్టింగ్ జరిగినట్లు నిర్ధారించారు.

ఇప్పటి వరకు రూ.367 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు
డబ్బు బదిలీ కోసం 10కి పైగా యాప్లు, 63 ఖాతాల నిర్వహణ
పది మంది బుకీల అరెస్ట్…. కీలక సూత్రధారి పరారీ
మహారాణిపేట (విశాఖపట్నం): విశాఖ కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. బెట్టింగ్ లో మోసపోయిన బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి సుమారు రూ.367 కోట్ల బెట్టింగ్ జరిగినట్లు నిర్ధారించారు. ఈ కేసులో కీలక సూత్రధారి పరారీలో ఉండగా.. అతనికి సహకరిస్తున్న పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం… అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన రెడ్డి సూరిబాబు పలు బెట్టింగ్ కంపెనీల నుంచి అనుమతి పొంది బుకీగా పనిచేస్తున్నాడు. ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్ల సమయంలో బెట్టింగ్లు నిర్వహిస్తుంటాడు. వివిధ ప్రాంతాల నుంచి పది మందిని భాగస్వాములను చేసి వారి ద్వారా మరింత మందికి విస్తరించాడు. ఇందుకోసం వీరు పదికి పైగా యాప్ లు, నగదు బదిలీ కోసం 63 ఖాతాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ బ్యాంకు ఖాతాల్లో గత కొన్నేళ్లుగా జరిగిన లావాదేవీలను పరిశీలించగా.. దాదాపు రూ.367 కోట్ల బెట్టింగ్ జరిగినట్లు తేలింది. సూరిబాబు ఒక్కో మ్యాచ్కు కోట్లాది రూపాయల బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడు. సూరిబాబుకు వందలాది మంది కస్టమర్లు. అయితే బెట్టింగ్ యాప్లు/వెబ్సైట్ల నిర్వహణకు సంబంధించిన సాఫ్ట్వేర్ నిర్వహణ వల్ల బెట్టింగ్దారులు ఆర్థికంగా నష్టపోతున్నారని పోలీసులు వెల్లడించారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-30T04:22:44+05:30 IST