రాజస్థాన్లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అర్ధరాత్రి చండీగఢ్లో ఇద్దరు షూటర్లు, మరో సహచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జైపూర్: రాజస్థాన్లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అర్ధరాత్రి చండీగఢ్లో ఇద్దరు షూటర్లు, మరో సహచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ మరియు రాజస్థాన్ పోలీసుల బృందం సంయుక్త ఆపరేషన్లో భాగంగా నిందితులను అరెస్టు చేసింది. ఇద్దరు హంతకులను రాజస్థాన్లోని జైపూర్కు చెందిన రోహిత్ రాథోడ్, హర్యానాలోని మహేంద్రగఢ్కు చెందిన నితిన్ ఫౌజీగా పోలీసులు గుర్తించారు. వీరికి సహకరించిన మూడో వ్యక్తి ఉధమ్సింగ్గా పోలీసులు గుర్తించారు. రోహిత్, ఉదమ్లను పోలీసులు ఢిల్లీకి తీసుకెళ్లారు. నితిన్ ఫౌజీ రాజస్థాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యానంతరం నిందితులు తమ ఆయుధాలను దాచిపెట్టి రాజస్థాన్ నుంచి హర్యానాలోని హిసార్ చేరుకున్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లోని మనాలి వెళ్లారు. అనంతరం చండీగఢ్కు తిరిగి వెళ్లి పోలీసులకు దొరికిపోయారు. మొబైల్ ఫోన్ లొకేషన్ల ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. హత్యపై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధిపతి, అదనపు డైరెక్టర్ జనరల్ (క్రైమ్) దినేష్ ఎంఎన్ కూడా ముగ్గురు నిందితుల అరెస్టును ధృవీకరించారు. అలాగే నిందితులను సోమవారం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఈ హత్యకు సంబంధించి రాంవీర్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. గోగమేడిని హతమార్చేందుకు ముష్కరులతో ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలపై జైపూర్లో రామ్వీర్ జాట్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కుట్రదారుల్లో ఒకరైన రాంవీర్ హత్యకు ముందు జైపూర్లోని తన స్నేహితుడు ఫౌజీతో కలిసి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేశాడు.
అసలేం జరిగిందంటే.. ఈ నెల 5వ తేదీన జైపూర్ లో సుఖ్ దేవ్ సింగ్ గోగమేడి తన ఇంట్లో నలుగురితో కలిసి టీ తాగుతుండగా.. అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. రక్తపు మడుగులో స్పృహతప్పి పడిపోయాడు. ఎదురుకాల్పుల్లో మరణించిన మూడో షూటర్ను నవీన్సింగ్ షెకావత్గా పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో గోగమేడి అంగరక్షకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇంతలో, గోల్డీ బ్రార్ మరియు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్లతో సంబంధం ఉన్న గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా ఈ హత్య వారి పని అని ప్రకటించాడు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి అధికార మార్పిడి జరగనున్న తరుణంలో కర్ణిసేన అధినేత హత్యకు గురికావడం సంచలనంగా మారింది.
నవీకరించబడిన తేదీ – 2023-12-10T08:33:05+05:30 IST