ఢిల్లీ: శీతాకాలం ఉత్తర భారతదేశంలోకి రాబోతోంది. విపరీతమైన చలి కారణంగా ఉత్తర భారతదేశం మొత్తం వణికిపోతోంది. దీంతో ఉదయం పూట ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. చలితో పాటు మంచు కూడా కురుస్తుండటంతో తెల్లవారుజామున కూడా చీకటిగా ఉంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మంచు కారణంగా రోడ్డు కనిపించక చాలా చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. విపరీతమైన చలి, మంచు కారణంగా ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రత రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో ఈ చలికాలంలో ఢిల్లీలో మంగళవారం అత్యంత చలిగా నమోదైంది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 13.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. భారత వాతావరణ శాఖ ప్రకారం ఇది సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా ఉంది. దేశ రాజధానిలో బుధవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 7.1 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.
దీంతో వాతావరణ శాఖ బుధవారం ఢిల్లీకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో గాలి నాణ్యత కూడా దెబ్బతింది. ఉత్తరప్రదేశ్లోనూ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. కాన్పూర్ మరియు ఆగ్రాలో 1.1 డిగ్రీల సెల్సియస్ మరియు 1.0 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విపరీతమైన చలి కారణంగా నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు ఢిల్లీలో నైట్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. ఈ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న వారికి దుప్పట్లు, బెడ్లు, వేడినీరు, ఆహారం అందజేస్తారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర రాజస్థాన్లలో ఈ నెల 14 వరకు దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం మధ్యప్రదేశ్, ఒడిశా, తూర్పు, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్లో ఈ నెల 12 వరకు పొగమంచు మంచుతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. రానున్న 48 గంటల్లో ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు ఉండవని కూడా తెలిపింది. అయితే రానున్న మూడు రోజుల పాటు తమిళనాడు, కేరళ, కోస్టల్ కర్ణాటక, లక్షద్వీప్ దీవుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
నవీకరించబడిన తేదీ – జనవరి 10, 2024 | 10:44 AM