దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో కొన్ని కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు మరియు మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని కేంద్రం మరిన్ని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో కొన్ని కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని మరిన్ని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఒక కమిటీని వేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 9-14 ఏళ్లలోపు బాలికల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఎంతో మంది యువత వైద్యులుగా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నారని, ఈ నేపథ్యంలో దేశంలో మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని, ఈ విషయాన్ని పరిశీలించి అవసరమైన సిఫార్సులు చేసేందుకు కమిటీని నియమిస్తామని నిర్మల తెలిపారు. చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు తీసుకొచ్చిన ‘మిషన్ ఇంద్ర ధనస్సు’ నిర్వహణ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన ‘యు-విన్’ వేదికను వేగంగా దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం దేశంలోని రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలవుతోంది. యు-విన్ పోర్టల్ కో-విన్ పోర్టల్కి లింక్ చేయబడుతుంది. U-WIN పోర్టల్ ద్వారా టీకా స్థితిని నవీకరించవచ్చు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ పథకాలను పక్కాగా అమలు చేసేందుకు సమగ్ర కార్యక్రమం చేపడతామని నిర్మల తెలిపారు. సక్షం అంగన్ వాడీ పథకం కింద అంగన్ వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని వివరించారు. పిల్లల ఎదుగుదలకు మెరుగైన పోషకాహారం పంపిణీ చేసేందుకు ‘పోషన్ 2.0’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయనున్నారు.
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 02, 2024 | 04:45 AM