వైజాగ్: గత కొంత కాలంగా ఫామ్ లో లేని టీమిండియా యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో గిల్ కీలక సమయంలో సత్తా చాటాడు. కష్టాల్లో ఉన్న జట్టుకు అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే దిశగా భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఓవర్ నైట్ స్కోరు 28/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఆరంభంలోనే తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఓపెనర్లు రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్ (17)లను పెవిలియన్ చేర్చాడు. అయితే రోహిత్ శర్మ రెండో రోజు స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించలేకపోయాడు. ఫలితంగా 30 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో పడింది. ఈ సమయంలో శుభమన్ గిల్ మరియు శ్రేయాస్ అయ్యర్ జట్టుకు మద్దతుగా నిలిచారు. వీరిద్దరూ జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. మూడో వికెట్కు 81 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధీటుగా ఆడిన శుభ్మన్ గిల్ 60 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు కెరీర్లో గిల్కి ఇది ఐదో అర్ధ సెంచరీ.
ఈ భాగస్వామ్యాన్ని 28వ ఓవర్లో స్పిన్నర్ టామ్ హార్ట్లీ విడదీశాడు. 29 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్టోక్స్ చేతికి చిక్కాడు. రన్నింగ్లో స్టోక్స్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో 111 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 9 పరుగులు చేసిన అరంగేట్ర ఆటగాడు రజత్ పాటిదార్ కూడా మరో స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో గిల్ (60), అక్షర్ పటేల్ (2) ఉన్నారు. 30 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత జట్టు 273 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 396 పరుగులు, ఇంగ్లండ్ 253 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి