రాజ్కోట్: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజున టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగించిన కెప్టెన్ రోహిత్ శర్మ (131), లోకల్ కుర్రాడు రవీంద్ర జడేజా (110*) సెంచరీలు సాధించారు. రోహిత్, జడేజాల సెంచరీలతో పాటు, అరంగేట్రం బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీతో వెలుగులోకి వచ్చాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో జడేజా (110), కుల్దీప్ యాదవ్ (1) ఉన్నారు. నిజానికి మ్యాచ్ ఆరంభంలోనే ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ఇంగ్లండ్ పై పట్టు సాధించాడు. అయితే ఆ తర్వాత రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా భారీ భాగస్వామ్యంతో జట్టును ఆదుకోవడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలిచారు. వీరితో పాటు చివర్లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుత అర్ధ సెంచరీ సాధించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వరుస ఓవర్లలో యశస్వి జైస్వాల్ (10), శుభ్మన్ గిల్లను పెవిలియన్కు చేర్చాడు. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన్ గిల్ ఈసారి డకౌట్ అయ్యాడు. టామ్ హార్ట్లీ రజత్ పాటిదార్ను తొలగించాడు. ఈ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, లోకల్ బాయ్ రవీంద్ర జడేజా జట్టుకు మద్దతుగా నిలిచారు. వీరిద్దరూ తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. క్రీజులో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. లంచ్ విరామ సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. రెండో సెషన్లో రోహిత్ శర్మ సెంచరీ, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ సాధించారు. టెస్టు కెరీర్లో హిట్మ్యాన్కి ఇది 11వ సెంచరీ. ఈ క్రమంలో వీరి భాగస్వామ్యం కూడా 100 పరుగులు దాటింది. ఫలితంగా రెండో సెషన్లో ఇంగ్లండ్కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు.
మూడో సెషన్లో రోహిత్, జడేజా భాగస్వామ్యం 200 దాటింది. ఈ సమయంలో సెంచరీ హీరో రోహిత్ శర్మను మార్క్ వుడ్ అవుట్ చేశాడు. దీంతో 204 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రోహిత్ 196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. మొత్తం 237 పరుగుల వద్ద టీమ్ ఇండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ధీటుగా బ్యాటింగ్ చేశాడు. వన్డే స్టైల్లో చెలరేగిపోయాడు. జడేజాతో కలిసి ఐదో వికెట్కు 77 పరుగులు జోడించాడు. కానీ 82వ ఓవర్లో సర్ఫరాజ్ ఖాన్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ఫలితంగా 314 పరుగులకే టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. సర్ఫరాజ్ ఖాన్ 66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్తో 62 పరుగులు చేశాడు. తర్వాత రవీంద్ర జడేజా తన టెస్టు కెరీర్లో నాలుగో సెంచరీని పూర్తి చేశాడు. 198 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత జడేజా, కుల్దీప్ యాదవ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తంగా తొలిరోజు ఆట 86 ఓవర్ల పాటు సాగింది.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి