ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది.

లోక్సభ ఎన్నికల వేళ బడ్జెట్లో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటన
రూ.2 వేల కోట్లు కేటాయింపు..18 ఏళ్లు పైబడిన వారు అర్హులు
న్యూఢిల్లీ/సిమ్లా, మార్చి 4:ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,000 అందజేస్తామని సోమవారం ప్రకటించారు. ఇది ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ కింద 2024-25 ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేయబడుతుంది. ఆర్థిక మంత్రి అతిషి మర్లెనా ఢిల్లీ అసెంబ్లీలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.76,000 కోట్ల బడ్జెట్ను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలకు ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘రామరాజ్యం’ కలను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1,000 ఇస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పథకం ప్రకటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించింది. మహిళా సాధికారత దిశగా ఈ పథకాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద అడుగు అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. లోక్సభ ఎన్నికల తర్వాత ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ అమలులోకి వస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా దాదాపు 45-50 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని తెలిపారు.
హిమాచల్ మహిళలకు నెలకు 1,500
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖ్ ఆ రాష్ట్ర మహిళలకు సోమవారం శుభవార్త ప్రకటించారు. 18 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు రూ. 1500 ఇస్తామని పేర్కొన్నారు.దీని కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో రూ. 800 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఇందిరా గాంధీ పారి బెహనా సుఖ్ సమ్మాన్ నిధి యోజన పేరుతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 5 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన పది హామీల్లో ఐదింటిని నెరవేర్చామని సుఖ్వీందర్ సింగ్ వెల్లడించారు.
నవీకరించబడిన తేదీ – మార్చి 05, 2024 | 03:51 AM