భారత ప్రభుత్వం ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో షాహిద్ లతీఫ్ ఇటీవల హతమైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 11న పాకిస్థాన్లోని పంజాబ్లో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు లతీఫ్ను కాల్చి చంపారు. అక్టోబర్ 11న లతీఫ్ ప్రార్థనలు చేసి తన సహచరులతో కలిసి బయటకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో మోటార్సైకిల్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు లతీఫ్పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో లతీఫ్తో పాటు ఇద్దరు సహచరులు అక్కడికక్కడే మృతి చెందారు. సియాల్కోట్ పోలీసులు హత్యను ధృవీకరించారు మరియు హత్య ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.
అసలు షాహిద్ లతీఫ్ ఎవరు?
షాహిద్ లతీఫ్ పాకిస్థాన్లోని గుజ్రాన్వాలా నగరంలో నివాసం ఉండేవాడు. 1970లో జన్మించిన అతడికి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి. 2016లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పఠాన్కోట్ దాడుల్లో లతీఫ్ ప్రమేయం ఉంది. పాకిస్థాన్లో కూర్చుని ఈ దాడికి ప్లాన్ చేశాడు. జైషే మహ్మద్ లాంచింగ్ కమాండర్ గా మారి.. నలుగురు ఉగ్రవాదులతో సమన్వయం చేసుకుని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి పంపాడు. అప్పటి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అతడిని పట్టుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. చివరికి దుండగుల దాడుల్లో చనిపోయాడు.
భారత ప్రభుత్వం లతీఫ్ను ఎందుకు విడిచిపెట్టింది?
నిజానికి, భారత ప్రభుత్వం 1994లో లతీఫ్ను అరెస్టు చేసింది. 1993లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా జమ్మూ కాశ్మీర్లో అక్రమంగా ప్రవేశించిన తర్వాత చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA) కింద ఉగ్రవాద ఆరోపణలపై 1994లో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అతను 16 సంవత్సరాలు గడిపాడు. జమ్మూలోని కోట్ బల్వాల్లో 2010 వరకు జైలులో ఉన్నారు. 2010లో భారత ప్రభుత్వం లతీఫ్ మరియు 24 మంది ఉగ్రవాదులను విడుదల చేసింది. వారిని అలా విడుదల చేయడానికి బలమైన కారణం ఉంది.
24 డిసెంబర్ 1999న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC 814 ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి బయలుదేరింది. అయితే.. ఈ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఈ విమానంలో 15 మంది సిబ్బందితో పాటు 176 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉగ్రవాదులు తమ 25 మంది సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ 25 మందిలో లతీఫ్ కూడా ఉన్నాడు. వారి విడుదలతో పాటు, వారు 200 మిలియన్ డాలర్ల విమోచనను కూడా డిమాండ్ చేశారు.
అయితే అప్పుడు భారత ప్రభుత్వం లతీఫ్ను విడుదల చేయలేదు. జైషే మహ్మద్ చీఫ్తో పాటు మరో ఇద్దరిని విడుదల చేశారు. 2010లో లతీఫ్ శిక్షాకాలం పూర్తయింది.దీంతో… వాఘా మీదుగా పాకిస్థాన్కు పంపించారు. మార్పు వస్తుందని భావిస్తే.. మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాడు. ఆరేళ్ల తర్వాత అంటే 2016లో పఠాన్ కోట్ దాడికి పాల్పడ్డాడు. బహుశా అతని శిక్షను పెంచి ఉంటే, పఠాన్కోట్ దాడులు జరిగేవి కావు.