చెన్నై, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మైచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైంది. సోమవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో చెన్నై పూర్తిగా జలమయమైంది. నదుల్లా ప్రవహించే కాలువలు, వీధులు ఎక్కడికక్కడ చెరువులుగా మారడంతో జనజీవనం స్తంభించిపోయింది. టీనగర్, కోడంబాక్కం, లింగంబాక్కం, పారిస్, మైలాపూర్ తదితర ప్రధాన ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. శివారు ప్రాంతాల్లో వర్షం నీరు నడుము లోతు ప్రవహిస్తోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పరిస్థితి విషమించడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, కాంచీపురం తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. అత్యవసర సేవలు అనుమతించబడతాయి. ఉద్యోగులను ఆఫీసులకు పిలవవద్దని, ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తూ ప్రైవేట్ సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి.
నిలిచిపోయిన రవాణా…
తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు చెన్నై నగరంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన అన్ని బస్సులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు, ప్రభుత్వ వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చెన్నై సెంట్రల్, ఎగ్మోర్, తాంబరం నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లే 50కి పైగా రైళ్లను రద్దు చేశారు. బయటి ప్రాంతాల నుంచి చెన్నైకి వచ్చే రైళ్లను కూడా మార్గం మధ్యలో నిలిపివేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. భారీ వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయం రన్వే జలమయమైంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేశారు. చెన్నై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాలను రద్దు చేశారు.
చెన్నైలో అంధకారం
ఈదురు గాలుల కారణంగా విద్యుత్ లైన్లు తెగిపోవడంతో చెన్నై నగరమంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడా కరెంటు సరఫరా లేదు. దీంతో విద్యుత్పై ఆధారపడిన అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. మొబైల్ ఫోన్లు కూడా చార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ కావడంతో వారి బంధువులకు ఏమైందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. పలుచోట్ల టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతినడంతో మొబైల్ ఫోన్లకు సిగ్నల్ సమస్య కూడా తలెత్తింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు ఫోన్ చేసి ఎలాంటి సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2023-12-05T03:56:39+05:30 IST