మరోవైపు విదేశాల్లో ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరుగా హతమవుతున్నారు. ముఖ్యంగా.. భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాదులను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేసి చంపేస్తున్నారు. ఇప్పుడు తాజాగా లష్కరే తోయిబా…

ఉగ్రవాది హమ్జా అద్నాన్ హతం: విదేశాల్లో ఉగ్రవాదులు వరుసగా హతమవుతున్నారు. ముఖ్యంగా.. భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాదులను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేసి చంపేస్తున్నారు. ఇప్పుడు తాజాగా, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అనుచరుడు హమ్జా అద్నాన్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. డిసెంబర్ 2వ తేదీన కరాచీలో ఈ ఘటన జరిగింది. అద్నాన్ ఇంటి బయట ఉండగా, కొందరు వ్యక్తులు ఒక్కసారిగా వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు. అద్నాన్ శరీరానికి కొన్ని బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పాక్ ఆర్మీ అతడిని రహస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే చికిత్స పొందుతూ అద్నాన్ మృతి చెందినట్లు పాక్ మీడియా పేర్కొంది.
ఈ హంజా అద్నాన్ ఎవరు? 2015లో జమ్మూకశ్మీర్లోని ఉదంపూర్లో, 2016లో కాశ్మీర్లోని పాంపోర్లో జరిగిన ఉగ్రదాడులకు ఇతడే సూత్రధారి. 2015లో బీఎస్ఎఫ్ జవాన్ల కాన్వాయ్పై జరిగిన దాడిలో ఇద్దరు జవాన్లు మరణించగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2016లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో 8 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అద్నాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో తన కార్యకలాపాలు సాగించేవాడని, భారత్లోకి ముష్కరులను పంపి దాడులు చేసేవాడని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్లో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తుండడంతో అతడిని పట్టుకోవడం సాధ్యం కాలేదు. అయితే.. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో అద్నాన్ తుది శ్వాస విడిచాడు. అతనితో పాటు మరికొందరు అనుచరులు, టాప్ కమాండర్లు హతమవుతున్న తరుణంలో.. పాకిస్థాన్లో ఉగ్రవాదులు భయపడ్డారు. ప్రాణాలు కాపాడుకునేందుకు రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం.
మరోవైపు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల సభ్యులు హతమవుతుండటంతో పాక్ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఎలా టార్గెట్ చేసి హత్యలు చేస్తారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అంతర్గత విభేదాల కారణంగా సన్నిహితులు ఈ హత్యలు చేశారా? లేక స్థానిక ప్రత్యర్థుల హస్తమా? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అయితే.. ఈ హత్యలతో ఆ ఉగ్రవాద సంస్థల అనుచరులు, ఇతర కీలక నేతలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు భారత్లో దాడులు చేసిన ఉగ్రవాదుల్లో 19 మంది గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో మరణించారు.
మరింత అంతర్జాతీయ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – 2023-12-06T16:28:18+05:30 IST