ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మాత్రమే అవకాశం
ప్రతి సంవత్సరం 20 వేల మందికి హెచ్సిఎల్తో ఒప్పందం
ఆర్నెల్లపాటు ఇంటర్న్షిప్.. స్టైఫండ్ రూ. నెలకు 10 వేలు
తర్వాత వార్షిక వేతనం 2.5 లక్షలు: మంత్రి సబిత
హైదరాబాద్ , డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ విద్యార్హతతోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం (తెలంగాణ ప్రభుత్వం) చర్యలు చేపట్టింది. ఇందుకోసం హెచ్సిఎల్ టెక్నాలజీ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఏటా 20 వేల మంది ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ బోర్డు ఇన్చార్జి కార్యదర్శి నవీన్ మిట్టల్తో సమీక్షించారు. హెచ్సీఎల్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు గణితం సబ్జెక్టుగా ఫిబ్రవరిలో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
ఈ పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు హెచ్సీఎల్ సంస్థ వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహించి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఆరు నెలల పాటు ఆన్లైన్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఆరు నెలల పాటు హెచ్సీఎల్ కార్యాలయంలో ఇంటర్న్షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ ఆరు నెలల పాటు నెలకు రూ.10 వేలు స్టైఫండ్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత రూ. 2.5 లక్షల వార్షిక వేతనంతో పూర్తిస్థాయి ఉద్యోగావకాశాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు విధులు నిర్వహిస్తూనే బిట్స్, శాస్త్ర, అమిటీ యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రి వివరించారు. కాగా, తెలంగాణ మాజీ సైనికుల వార్షికోత్సవ క్యాలెండర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తేజోమూర్తిల చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో తెలంగాణ సాహితీ వేత్తల జయంతి, వర్ధంతిని పురస్కరించుకుని ప్రతిరోజూ పాఠశాలల్లో సభ నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
మార్చి 15 నుంచి నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి సబిత.. గురువారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. నామినల్ రోల్స్ నుంచి పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన వరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు సన్నద్ధం కావాలి. ప్రయివేటు విద్యార్థులతో సమానంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు ఇన్చార్జి కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2022-12-30T11:14:02+05:30 IST