ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మొండి బకాయిల తగ్గింపుతో పాటు వడ్డీ ఆదాయం గణనీయంగా పెరగడం వల్ల జూన్ త్రైమాసికంలో కెనరా బ్యాంక్ నికర లాభం 75 శాతం పెరిగి రూ.3,535 కోట్లకు చేరుకుందని పేర్కొంది.

Q1 లాభంలో 75% వృద్ధి రూ.3,535 కోట్లుగా నమోదైంది
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీ ఆదాయం గణనీయంగా పెరగడం వల్ల జూన్ త్రైమాసికంలో నికర లాభం 75 శాతం పెరిగి రూ.3,535 కోట్లకు చేరుకుందని కెనరా బ్యాంక్ ఎండి, సిఇఒ కె సత్యనారాయణ రాజు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ నికర లాభం రూ.2,022 కోట్లు. త్రైమాసిక సమీక్ష కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.23,352 కోట్ల నుంచి రూ.29,828 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో వడ్డీ ఆదాయం రూ.18,177 కోట్ల నుంచి రూ.25,004 కోట్లకు పెరిగిందని బ్యాంక్ వెల్లడించింది. నికర వడ్డీ మార్జిన్ (NIM) కూడా 2.78 శాతం నుంచి 3.05 శాతానికి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ఐఎం 3 శాతానికిపైగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సత్యనారాయణరాజు తెలిపారు.
తగ్గిన NPAలు
మరోవైపు, స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) కూడా 6.98 శాతం నుంచి 5.15 శాతానికి, నికర ఎన్పీఏలు 2.48 శాతం నుంచి 1.57 శాతానికి తగ్గాయని బ్యాంక్ తెలిపింది. త్రైమాసిక సమీక్ష కాలంలో మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు రూ.2,418 కోట్లుగా ఉన్నాయి. జూన్ త్రైమాసికం ముగింపు నాటికి బ్యాంక్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో (సీఏఆర్) 16.24 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి రేటు 10.5 శాతం, డిపాజిట్లు 8.5 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. వ్యాపార వృద్ధి కోసం టైర్-1, టైర్-2 బాండ్ల జారీ ద్వారా రూ.7,500 కోట్లు సమీకరించాలని చూస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్లో GIFT-IFSCలో ఆఫ్షోర్ బ్యాంకింగ్ విభాగాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు రాజు తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2023-07-25T03:26:10+05:30 IST