వారణాసి జిల్లా కోర్టు తీర్పు
సరైనది, సముచితమైనది
దానిలో జోక్యం చేసుకోండి
అవసరం లేదు
సర్వేలో భాగంగా మసీదు
ఆవరణలో తవ్వడం లేదు
అలహాబాద్ హైకోర్టు తీర్పు
మసీదు కమిటీ సుప్రీంకు
సీజేఐ వెంటనే పరిశీలిస్తారు
ప్రయాగ్రాజ్, వారణాసి, న్యూఢిల్లీ, ఆగస్టు 3: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిపుణులు శుక్రవారం నుంచి ఈ సర్వేను ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న ఈ మసీదును హిందూ దేవాలయం స్థానంలో నిర్మించారని, దీనిపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించి పరిష్కరించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు వారణాసి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విచారణ చేపట్టిన కోర్టు సర్వే చేపట్టాలని జూలై 21న ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ అధికారుల బృందం జూలై 24న సర్వే ప్రారంభించింది. అయితే మసీదు కమిటీ జూలై 25న సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జులై 26 సాయంత్రం 5 గంటల వరకు సర్వేను నిలిపివేసిన సుప్రీంకోర్టు వారణాసి కోర్టు తీర్పుపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
సుప్రీంకోర్టు సూచనల మేరకు మసీదు కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సర్వేకు అనుమతినిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. సర్వే నిర్వహించాలన్న వారణాసి జిల్లా కోర్టు తీర్పు సరైనదేనని, సముచితమని.. అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ మసీదు కమిటీ పిటిషన్ను కొట్టివేసింది. విచారణ సందర్భంగా మసీదు కమిటీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఎస్ఎఫ్ఏ నఖ్వీ, ఏఎస్ఐ అధికారులు మసీదు ప్రాంగణానికి తీసుకొచ్చిన తవ్వే పరికరాల (తవ్వేందుకు ఉపయోగించే పరికరాలు) ఫొటోలను సమర్పించారు. అక్కడ తవ్వకాలు జరిపే ఆలోచనలో ఏఎస్సై ఉన్నట్లు తెలిపారు. దీనిపై అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ దివాకర్ స్పందిస్తూ.. సర్వేలో భాగంగా ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని ఉద్ఘాటించారు. కాగా, సర్వేపై జిల్లా కోర్టు తీర్పు వెంటనే అమల్లోకి వస్తుందని హైకోర్టు చెప్పిందని హిందువుల తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ తెలిపారు.
మళ్లీ సుప్రీంకు..
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే ఆర్టికల్ 370కి సంబంధించిన కేసులను విచారిస్తున్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వద్ద మసీదు కమిటీ తరపు న్యాయవాది నిజాం పాషా ఈ విషయాన్ని ప్రస్తావించారు. హైకోర్టు తీర్పుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.. దీనిపై అత్యవసరంగా విచారణ జరిపించాలని కోరుతూ ఈమెయిల్ పంపి.. సర్వే జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సీజేఐ ఈమెయిల్ను వెంటనే చూస్తానని చెప్పారు. కాగా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు కూడా వినాలని హిందూ పిటిషనర్లు కేవియట్ దాఖలు చేశారు.
ఇది బౌద్ధమతం యొక్క పిటిషన్
జ్ఞానవాపి కేసులో కొత్త ట్విస్ట్. హిందువులు, ముస్లింలు వాదిస్తున్నందున అది గుడి లేదా మసీదు కాదని నిరూపించేందుకు ఏఎస్ఐ సర్వే నిర్వహించాలని కోరుతూ బౌద్ధ గురువు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని పేరు గురు సుమిత్ రతన్ భంటే.
నవీకరించబడిన తేదీ – 2023-08-04T03:18:16+05:30 IST