న్యూఢిల్లీ : అవినీతిని భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అవినీతి వల్ల ప్రజల జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయన్నారు. అవినీతి ప్రభావం వనరుల వినియోగంపై పడుతుందన్నారు. ఇది మార్కెట్లను కుదిపేస్తుందని, సేవల పంపిణీపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ఇవన్నీ భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. కోల్కతాలో శనివారం జరిగిన జీ20 అవినీతి వ్యతిరేక సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
అవినీతి నిర్మూలన కోసం పోరాడడం మన ప్రజలకు పవిత్ర కర్తవ్యం’ అని మోదీ అన్నారు. కౌటిల్యుడి అర్థ శాస్త్రాన్ని ప్రస్తావిస్తూ, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ నిధులను పెంచడం ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. అత్యాశ క్రమంగా సత్యాన్ని, చిత్తశుద్ధిని క్షీణింపజేస్తుందని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
మరింత పారదర్శకత, జవాబుదారీ వ్యవస్థను రూపొందించేందుకు సాంకేతికత, ఇ-గవర్నెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పథకాల్లో లీకేజీలు, లోటుపాట్లను పరిశీలిస్తున్నామన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. ఈ విధానంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు.
ప్రభుత్వం ఆయుధాలు, ఇతర యంత్రాలను కొనుగోలు చేసేటప్పుడు అవినీతి రహితంగా మరియు జవాబుదారీగా ఉండేలా ప్రభుత్వ ఇ-మార్కెట్ప్లేస్ పోర్టల్ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ పోర్టల్ ఎంతో పారదర్శకతను తీసుకొచ్చిందని తెలిపారు. 2018లో ఆర్థిక నేరగాళ్ల చట్టాన్ని తీసుకొచ్చామని, అప్పటి నుంచి ఆర్థిక నేరగాళ్లు, పారిపోయిన వారి నుంచి 1.8 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేశామన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం, 2014 నుండి ఆర్థిక నేరగాళ్లకు చెందిన 12 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు.
ఈ నెల 9న కోల్కతాలో జీ20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు శనివారంతో ముగిశాయి. ఈ సమావేశాల్లో జీ20 దేశాల మంత్రులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:
యూపీ అసెంబ్లీ: నవ్వులు పూయించిన యోగి ఆదిత్యనాథ్, శివపాల్ యాదవ్ సంభాషణ