సాధారణంగా మనం ఎస్కలేటర్లపై నిలబడితే.. అవి మనల్ని పైకి/కిందకు తీసుకెళ్తాయి. కానీ…తొందరగా ఉన్న కొందరు ఆ ఎస్కలేటర్లపై వేగంగా నడవడం లేదా పరిగెత్తడం చేస్తుంటారు. అత్యవసర సమయంలో అందరూ చేసేది ఇదే. కానీ.. ఇకపై అలా (నడక, పరుగు) చేయడాన్ని జపాన్ నిషేధించింది. ఎంత అత్యవసరమైనా సరే. జపాన్లోని నగోయా అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త ఆర్డినెన్స్ను అమల్లోకి తీసుకురాగా.. ప్రమాదాల నివారణకు నగోయా సిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
నిజానికి.. జపాన్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఓ రూల్ పాటిస్తున్నారు. ఎస్కలేటర్పై నిలబడిన వ్యక్తులు ఎడమవైపు కదలరు. నడిచే వారు కుడివైపు నుంచి వెళ్లిపోతారు. కానీ.. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం ప్రజలు ఇరువైపులా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నడవడానికి వీలు లేదు. రైల్వే స్టేషన్లు, కార్యాలయ భవనాలు మరియు షాపింగ్ మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలలో ప్రజలు ఎస్కలేటర్లపై నిశ్చలంగా నిలబడాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నిబంధనను ఉల్లంఘించిన కేసులు లేవు. నగోయా నగరం నడవకూడదని ఆర్డినెన్స్ తెచ్చింది తప్ప, దాని ఉల్లంఘనకు ఎటువంటి జరిమానా విధించబడలేదు.
జపాన్ టైమ్స్ ప్రకారం, 2018 మరియు 2019 మధ్య 805 ఎస్కలేటర్ ప్రమాదాలు జరిగాయి. సరిగ్గా ఉపయోగించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలు తెలిపాయి. ఎస్కలేటర్లపై నడవడం లేదా పరుగెత్తడం వల్ల ప్రజలు తమ బ్యాలెన్స్ కోల్పోతారని, తద్వారా ఊహించని సంఘటనలు జరుగుతాయని కనుగొనబడింది. కొందరు అనవసరంగా ఎస్కలేటర్లపై నుంచి కిందకు పరుగెత్తడం కూడా గమనించారు. వాటి వల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నారని, ఆంప్యూటీ లేదా క్రచెస్ సహాయంతో నడిచే వ్యక్తులు ప్రమాదాలకు గురవుతున్నారని నివేదికలు నిర్ధారించాయి. అందుకే.. ఊరికే నిలబడేలా ఈ కొత్త ఆర్డినెన్స్.
అదే సమయంలో, నగోయా నగర ప్రభుత్వం ప్రధాన రైల్వే స్టేషన్లలో కొత్త ఆర్డినెన్స్ పోస్టర్లను ఉంచింది. ఈ పోస్టర్లలో ‘రెండువైపులా నిలబడి ఎస్కలేటర్లపై వెళ్దాం’, ‘ఎస్కలేటర్లపై పరుగెత్తకుండా ఇరువైపులా నిలబడడం మన బాధ్యత’ అని కార్టూన్లు రూపొందించారు. అయితే, జపాన్లో ఇలాంటి ఆర్డినెన్స్ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ 2021లో, సైతామా ప్రిఫెక్చర్ ఎస్కలేటర్లపై కదలికను కూడా నిషేధించింది. ఆర్డినెన్స్ ప్రకారం వినియోగదారులు ఎస్కలేటర్లపై నడవకూడదు లేదా పరుగెత్తకూడదు.