ఛత్తీస్గఢ్లోని భానుప్రతాప్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కిండర్ గార్టెన్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.
రాయ్పూర్: ఉచిత విద్యతో పాటు సమాజంలోని వివిధ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఛత్తీస్గఢ్లోని భానుప్రతాప్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కిండర్ గార్టెన్ (కేజీ) నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు తెలిపారు. నవంబర్ 7న తొలి దశ ఎన్నికలు జరగనున్న 20 నియోజకవర్గాల్లో భానుప్రతాపూర్ ఒకటి.
రాజీవ్ గాంధీ పత్రహన్ యోజన కింద బీడీ ఆకుల ధరను రూ.4వేలకు పెంచుతామని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తిరిగి అధికారంలోకి వస్తే ఇతర మైనర్ ఫారెస్ట్ ఉత్పత్తుల కనీస మద్దతు ధర రూ.10 పెంచుతామని హామీ ఇచ్చారు. ఆదివాసీల ప్రాబల్యం ఉన్న బస్తర్లో బీడీ ఆకులను కోయడం, సేకరించడం ప్రజల ప్రధాన జీవనాధారం.
కుల గణన నుండి ప్రధాని ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?
రాహుల్ తన ప్రసంగంలో కుల గణనపై ప్రధాని వైఖరిని కూడా విమర్శించారు. తన ప్రసంగాల్లో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) గురించి మాట్లాడే ప్రధాని… కుల గణన విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని నిలదీశారు. దేశంలో కుల గణన చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఎంపిక చేసిన కొద్ది మంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే బీజేపీ పనిచేస్తుందని, కాంగ్రెస్ పార్టీ రైతులు, దళితులు, కార్మికులు, గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఆదివాసీలను ఆదివాసీలుగా పిలవడానికి బదులు బీజేపీ వారిని వనవాసీ అని సంబోధించడం గిరిజన సంస్కృతి, చరిత్ర, భాషకు అవమానకరమని విమర్శించారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-28T20:09:33+05:30 IST