జైపూర్: ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే అధికారులు ఈవీఎం బాక్సులతో పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం ఐదు రాష్ట్రాలైన రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు మిజోరాం అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈరోజు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ఓటు వేశారు. మరికొన్ని చోట్ల ఓటింగ్ నెమ్మదిగా ప్రారంభమైంది. కాలక్రమేణా అది పుంజుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తత చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు నేడు ఒకే దశలో జరుగుతున్నాయి. డిసెంబర్ 3న మిగిలిన 4 రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. రాజస్థాన్లో కేంద్రంలోని అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. రాజస్థాన్లోని 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కునార్ ఆకస్మిక మరణంతో ఎన్నికలను వాయిదా వేశారు. 199 స్థానాలకు 1,862 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం ఓటర్లు 5,25,38,105 మంది కాగా.. వీరిలో మూడో వంతు (1,70,99,334) 18-30 ఏళ్ల మధ్య వయసు వారు ఉండడం గమనార్హం. వీరిలో 22,61,008 మంది (18-19 ఏళ్ల మధ్య) తొలిసారిగా ఓటు వేస్తున్నారు. పురుష ఓటర్ల సంఖ్య 2.73 కోట్లు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2.52 కోట్లు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుచుకోగా.. 73 సీట్లు గెలుచుకున్న బీజేపీ ప్రధాన ప్రతిపక్షం. స్వతంత్రులు-13, బీఎస్పీ-6, ఆర్ఎల్పీ-3, సీపీఎం-2, బీటీపీ-2, ఆర్ఎల్డీ ఒక స్థానంలో విజయం సాధించాయి.
నవీకరించబడిన తేదీ – 2023-11-25T09:20:34+05:30 IST