భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.

పీవీ తెలంగాణకు గర్వకారణం: భట్టి
రాంగోపాల్పేట/న్యూఢిల్లీ/హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా శనివారం పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞాన్ భూమి వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీతక్క తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారినప్పుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. పేదలకు భూ పంపిణీకి పీవీ బలమైన పునాదులు వేశారని, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఎల్లవేళలా ఆచరణీయమని అన్నారు. పీవీ ఘాట్, జైపాల్రెడ్డి ఘాట్లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఈ రెండూ తెలంగాణకు లంకె బిందెలా ఉన్నాయన్నారు. పివి ఖ్యాతిని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పీవీ కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ నేతలు పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కాగా, పీవీ నరసింహారావు ప్రధానిగా దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని, అలాంటి వ్యక్తి తెలంగాణలో పుట్టడం రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మాజీ పీవీ 9వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పీవీ చిత్రపటానికి డిప్యూటీ సీఎం భట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భూసంస్కరణల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. పీవీ ఆలోచనలను, బాటను ముందుకు తీసుకెళ్లేలా భావి తరాలను ప్రోత్సహించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని భట్టి అన్నారు. మరోవైపు గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు పీవీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 24, 2023 | 04:47 AM