జేడీయూ అధినేత నితీష్ కుమార్ బాటలో మళ్లీ బీజేపీతో చేతులు కలిపేందుకు మరికొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ

బీజేపీ సీనియర్ నేత వెల్లడి.. తమిళనాడు నుంచి మోడీ పోటీ?
న్యూఢిల్లీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): జేడీయూ అధినేత నితీష్ కుమార్ బాటలో మళ్లీ బీజేపీతో చేతులు కలిపేందుకు మరికొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. పంజాబ్కు చెందిన అకాలీదళ్ కూడా తమతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉందన్నారు. కర్ణాటకలో తమతో కలిసి పోటీ చేసేందుకు జేడీఎస్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం దక్షిణాదికి చెందిన ఒకటి రెండు పార్టీలతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 9న పార్లమెంట్ సమావేశాలు ముగియడంతో ఏ రోజుకైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయని.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడంపై దృష్టి సారించిన ప్రధాని మోదీ.. సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, రామనాథపురం, కన్యాకుమారి స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయవచ్చని సమాచారం. ప్రధాని మోదీ జనవరిలో మూడు రోజుల పాటు తమిళనాడులో పర్యటించడమే కాకుండా వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులను ప్రారంభించి, ఆలయాలను సందర్శించి, భారీ రోడ్ షోలు నిర్వహించారు. తాజాగా కేంద్రం పద్మవిభూషణ్తో సత్కరించిన ఐదుగురిలో ఇద్దరు తమిళనాడుకు చెందిన వారు కావడం, కెప్టెన్ విజయకాంత్కు మరణానంతరం పద్మభూషణ్ ప్రదానం చేయడం, ఐదుగురు తమిళులకు పద్మశ్రీ పురస్కారం లభించడం ఇందుకు నిదర్శనం. కాగా, దక్షిణాది నుంచి మోదీ పోటీ చేయాలనుకుంటే తెలంగాణ నుంచి పోటీ చేయాలని అభ్యర్థిస్తానని రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని, మోడీ పోటీ చేస్తే కుంకుమ వర్ణం వస్తుందని… ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై కూడా పడుతుందని అభిప్రాయపడ్డారు.
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 01, 2024 | 03:01 AM