ఉత్కంఠగా సాగిన సెమీస్లో పాకిస్థాన్ ఓటమి
అండర్-19 ప్రపంచకప్
బెనోని (దక్షిణాఫ్రికా): అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్తో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వికెట్ తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. తొలుత పేసర్ టామ్ స్ట్రాకర్ (6/24) ధాటికి పాకిస్థాన్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. అజాన్ అవాయిస్ (52), అరాఫత్ మిన్హాస్ (52) అర్ధ సెంచరీలతో మెరిశారు. ఛేదన్లో ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హ్యారీ డిక్సన్ (50), ఆలివర్ పెక్ (49) తమ సత్తా చాటారు. అలీ రజా 4 వికెట్లు, అరాఫత్ 2 వికెట్లు తీశారు. స్ట్రాకర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం ఇదే వేదికపై భారత్, ఆసీస్ మధ్య టైటిల్ పోరు జరగనుంది. తొలి సెమీస్ లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చివరకు హైడ్రామా..: ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఓపెనర్లు డిక్సన్, సామ్ తొలి వికెట్ కు 33 పరుగులతో శుభారంభం అందించారు. తర్వాత ఆసీస్ 26 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోయి 59/4తో నిలిచింది. కానీ డిక్సన్, ఆలివర్ ఐదో వికెట్కు 43 పరుగులు జోడించారు. ఆ తర్వాత క్యాంప్బెల్తో కలిసి ఆలివర్ ఆరో వికెట్కు 44 పరుగులు జోడించడంతో ఆస్ట్రేలియా కోలుకుంది. కానీ పాక్ బౌలర్లు మళ్లీ విజృంభించడంతో వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 46 ఓవర్లు ముగిసే సరికి 164/9తో నిలవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఒక్క వికెట్ కోల్పోతే పాకిస్థాన్ గెలుస్తుంది. కానీ మెక్మిలన్, విడ్లర్ (నాటౌట్ 2) హుషారుగా ఆడి మ్యాచ్ను చివరి ఓవర్ వరకు లాగారు. ఆఖరి ఓవర్లో మూడు పరుగులు కావాల్సి ఉండగా.. జీషన్ వేసిన తొలి బంతి మెక్ మిలన్ బ్యాట్ ను తాకి బౌండరీ లైన్ దాటింది. షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డర్ ఒబైద్ బంతిని ఆపేందుకు డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. అంతే.. ఆస్ట్రేలియా జట్టు సంబరాల్లో మునిగిపోయింది.
చిన్న స్కోరు
పాకిస్తాన్: 48.5 ఓవర్లలో 179 (అజాన్ 52, అరాఫత్ 52, హుస్సేన్ 17, స్ట్రేకర్ 6/24).
ఆస్ట్రేలియా: 49.1 ఓవర్లలో 181/9 (డిక్సన్ 50, పెక్ 49, టామ్ కాంప్బెల్ 25, మెక్మిలన్ 19 నాటౌట్, అలీ రజా 4/34, అరాఫత్ 2/20).