
బెంగళూరు నీటి సంక్షోభం: కర్ణాటక రాజధాని బెంగళూరు నీటి ఎద్దడితో అల్లాడుతోంది. వర్షాభావ పరిస్థితులతో బెంగళూరు వాసులు తాగునీటి సమస్యతో అవస్థలు పడుతున్నారు. నగరంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉండడంతో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు తాగునీటి వృథాను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. తాజాగా మంచి నీటిని వృథా చేస్తే జరిమానా విధించాలని నిర్ణయించింది. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే జరిమానా తప్పదని హెచ్చరించింది.
నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని తాగునీటిని వృథా చేయవద్దని జలమండలి నగరవాసులను కోరింది. వాహనాలు కడగడం, నిర్మాణాలు, వినోదాలకు తాగునీటిని ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేసింది. తాగునీరు ఇతర అవసరాలకు వినియోగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తారు. ప్రతిసారి పునరావృతమైతే అదనంగా రూ. 500 జరిమానా విధిస్తారు.
ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ
1.3 కోట్ల జనాభా ఉన్న బెంగళూరులో రోజువారీ 1,500 MLD (రోజుకు మిలియన్ లీటర్లు) నీటి కొరతను ఎదుర్కొంటోంది. నీటి కొరతను అధిగమించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. రెసిడెన్షియల్ కాలనీలు మరియు అపార్ట్మెంట్ అసోసియేషన్లను రీసైకిల్ చేసిన శుద్ధి చేసిన నీటిని ఉపయోగించమని ప్రోత్సహించడం. అక్రమ నీటి ట్యాంకర్ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం హెల్ప్లైన్లు, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు భారీగా రేట్లను పెంచినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఇన్ఫోసిస్ సుధామూర్తి రాజ్యసభకు నామినేట్.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్టి
219 తాలూకాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు
బెంగళూరులోనే కాకుండా కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్య ఉంది. తుమకూరు, ఉత్తర కన్నడ జిల్లాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉందని రెవెన్యూ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 236 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఇందులో 219 తాలూకాలు తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.