భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
23 నుంచి దరఖాస్తుల స్వీకరణ
జనవరి 12 వరకు అవకాశం
ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష
హైదరాబాద్ , డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు పోటీ చేసే అభ్యర్థులు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అధికారులు గురువారం ప్రకటించారు. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ను ఈ నెల 23న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4లో 9,168 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల ఎంపిక కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష విధానం
గ్రూప్-4 పోస్టుల భర్తీకి అభ్యర్థులకు ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షను 300 మార్కులకు నిర్వహిస్తారు. 300 ప్రశ్నలు ఇస్తారు. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఉదయం, పేపర్-2 సాయంత్రం నిర్వహిస్తారు. ఒక్కో పేపర్లో 150 ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులకు నిర్వహించారు. ఒక్కో పేపర్ రాయడానికి 150 నిమిషాల సమయం ఇస్తారు.
పేపర్-1లో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ, పాలిటిక్స్ ఆఫ్ తెలంగాణ వంటి సబ్జెక్టులు ఉంటాయి. పేపర్-2లో మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ వంటి సబ్జెక్టులు ఉంటాయి. ఈ పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూలు ఉండవు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. కేటగిరీల వారీగా రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, కొత్తగా పెంచిన ఎస్టీ రిజర్వేషన్లు కూడా అమలు చేయనున్నారు.
అసిస్టెంట్ ఇంజనీర్స్ అభ్యర్థులకు సవరణ ఎంపిక!
అసిస్టెంట్ ఇంజనీర్లు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ల ఎంపికను అందించారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ అధికారులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు తమ వివరాలను సవరించుకోవాలని సూచించారు.
ఈ నెలలో మరిన్ని నోటిఫికేషన్లు!
ఈ నెలలో మరిన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేపట్టింది. 783 గ్రూప్-2 పోస్టులు, 1373 గ్రూప్-3 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. వీటికి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. 1000 వరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. డిసెంబర్ 31లోగా అన్ని రకాల నోటిఫికేషన్లు జారీ చేయాలని కమిషన్ అధికారులు భావిస్తున్నారు.ఈ పోస్టుల భర్తీ కూడా రాత పరీక్ష ద్వారానే జరుగుతుంది.
నవీకరించబడిన తేదీ – 2022-12-02T11:26:55+05:30 IST