ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు
783 పోస్టులు… 5,51,943 మంది అభ్యర్థులు
హైదరాబాద్ , ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-2 పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్ణయించింది.ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దాదాపు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు దాదాపు 705 మంది పోటీ పడుతున్నారు. పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పరీక్షలకు వారం రోజుల ముందు వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
మే 26, 27 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్ష
మార్చి 6 నుంచి మే 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
KU క్యాంపస్, ఫిబ్రవరి 28: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్-23 నోటిఫికేషన్ విడుదలైంది. మంగళవారం వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, కేయూ వీసీ ప్రొఫెసర్ టి.రమేష్, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి.వరలక్ష్మి, రిజిస్ట్రార్ శ్రీనివాసరావు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు ఐసెట్ వివరాలను వెల్లడించారు. మార్చి 6 నుంచి మే 6 వరకు ఆన్లైన్లో ఐసెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని, రూ.250 అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.500 అపరాధ రుసుముతో మే 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు రూ.550, ఇతర వర్గాలు రూ.750 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలని వివరించారు. మే 22 నుంచి హాల్ టిక్కెట్లు జారీ చేస్తామని.. మే 26, 27 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 5న ప్రిలిమినరీ కీ ఇస్తారని, 8 వరకు కీపై అభ్యంతరాల స్వీకరణ, 20న తుది ఫలితాలు ప్రకటిస్తామని, పరీక్ష సిలబస్, మోడల్ ప్రశ్నపత్రాలు, మాక్ టెస్ట్ వివరాల వెబ్సైట్ icet.tsche.ac.inవివరాలకు 0870-2958088, 0870-2439088లో సంప్రదించాలని తెలిపారు.