గురుకుల పోస్టులకు ఈరోజు నోటిఫికేషన్
మొదట 2,876 పోస్టుల భర్తీకి విడుదల చేసింది
డిగ్రీ కాలేజీల్లో 868, జూనియర్ కాలేజీల్లో 2,008 పోస్టులు
దరఖాస్తు చేసుకోవడానికి మే 17 చివరి తేదీ
జోనల్ మరియు మల్టీ జోనల్ వివరాలు నోటిఫికేషన్లో తేలాల్సి ఉంటుంది
మొత్తం 9,231 పోస్టుల భర్తీకి 5వ తేదీన ప్రభుత్వం ప్రకటన
ఇతర పోస్టులకు ఈ నెల 27, 28 తేదీల్లో నోటిఫికేషన్లు
హైదరాబాద్ , ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో (తెలంగాణ) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల (గురుకుల పోస్టులు) భర్తీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం తొలి నోటిఫికేషన్ విడుదల కానుంది. గురుకులాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 9231 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఐబీ) ఈ నెల 5న ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కలిపి మొత్తం 2876 పోస్టుల భర్తీకి అధికారులు ముందుగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వీటిలో డిగ్రీ కాలేజీల్లో 868, జూనియర్ కాలేజీల్లో 2008 పోస్టులు ఉంటాయి. మిగిలిన 6355 పోస్టులకు ఈ నెల 24, 28 తేదీల్లో మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. సోమవారం నోటిఫికేషన్ విడుదలయ్యే పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 17 వరకు అవకాశం ఉంటుంది. దీనికి ముందు అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఇందుకోసం రిక్రూట్మెంట్ బోర్డు ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో ఓటీఆర్ను అందుబాటులోకి తెచ్చింది.
అర్హత, జోనల్ వివరాలు తేలాల్సి ఉంది..
డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో 2876 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో దరఖాస్తుకు కావాల్సిన విద్యార్హతలు, కేటగిరీ, రిజర్వేషన్ వివరాలను వెల్లడించనున్నారు. వీటితో పాటు జోనల్, మల్టీజోనల్, జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు భర్తీ చేయాలన్న దానిపై స్పష్టత రానుంది. కాగా, డిగ్రీ కాలేజీల్లో భర్తీ చేయనున్న లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల వేతన స్కేలు రూ.58,850 నుంచి రూ.1,37,050కి చేరనుంది. జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు పే స్కేల్ రూ.54,420 నుంచి రూ.1,33,630. డిగ్రీ కాలేజీ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో భర్తీ చేయనుండగా, జూనియర్ కాలేజీల్లో ఈ మూడింటితోపాటు మైనార్టీ గురుకులాల్లోనూ భర్తీ చేయనున్నారు. డిగ్రీ కళాశాలల్లో భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎస్సీ గురుకులాల్లో 174, గిరిజన సంక్షేమంలో 287, బీసీ గురుకులాల్లో 407 పోస్టులు ఉన్నాయి. జూనియర్ కాలేజీల్లో భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎస్సీ గురుకులాల్లో 253, గిరిజన సంక్షేమంలో 291, బీసీ గురుకులాల్లో 1070, మైనార్టీ గురుకులాల్లో 394 పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో జూనియర్ కాలేజీల్లో 324 మ్యాథమెటిక్స్ పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో 99 కంప్యూటర్ సైన్స్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
నవీకరించబడిన తేదీ – 2023-04-17T10:55:02+05:30 IST