అప్పటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ..

జస్టిస్ రమణ లేఖ కేసుపై సుప్రీం వ్యాఖ్య
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): 2020లో అప్పటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ అప్పటి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం న్యాయవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లేఖ రాసిన జగన్పై చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని, షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని న్యాయవాది సుశీల్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. లేఖ ఉద్దేశంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆ పిటిషన్లో సుశీల్కుమార్ సింగ్ కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తుండగా.. 1953లో బ్రహ్మప్రకాశ్ శర్మ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘‘మీరు చెప్పేది నిజమే కానీ ఈ అంశం 2020 నుంచి.. ఆ తర్వాత ఎలాంటి ప్రకటన రాలేదు. .మరి కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది?” అని ప్రశ్నించగా.. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలి అని లాయర్ బదులిచ్చారు.‘మీ వాదనను మేము అంగీకరిస్తున్నాము. ఇలాంటివి (న్యాయ) వ్యవస్థ ప్రయోజనాలకు మంచిది కాకపోవచ్చు. కొన్నిసార్లు ఇటువంటి చర్యలు ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ అంశం అకడమిక్ (పాఠ్యపుస్తక చర్చగా మారింది). కాబట్టి ఈ పిటిషన్ను కొనసాగించడం గురించి పిటిషనర్ నుండి సూచనలను తీసుకోండి. ఇలా చెప్పడం వల్ల కేసు క్లోజ్ అవుతుందని కాదు. మెరిట్ల ఆధారంగా మీ వాదనలు వింటాం’’ అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
నవీకరించబడిన తేదీ – 2023-09-26T02:29:14+05:30 IST