పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని కేపీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీనియర్ నేత బీకే హరిప్రసాద్కు సూచించారు.

– హరిప్రసాద్పై డీకే శివకుమార్ సూచన
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని సీనియర్ నేత బీకే హరిప్రసాద్కు కేపీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచించారు. బీకే హరిప్రసాద్ను గురువారం డీకే శివకుమార్ తన నివాసానికి పిలిచారు. సుదీర్ఘ చర్చ జరిగింది. ఇటీవల బీసీ సంఘం సమావేశంలో సీఎం సిద్ధరామయ్యను ఉద్దేశించి బీకే హరిప్రసాద్ నేరుగా పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘ముఖ్యమంత్రిని ఎలా కూర్చోబెట్టాలో.. ఎలా దించాలో కూడా తెలుసు’ అని వ్యాఖ్యానించారు. సీఎంను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పలుమార్లు ఈ వ్యాఖ్యలు చేయడంతో పార్టీ అధిష్టానం నోటీసులు జారీ చేసింది. అప్పటి నుంచి హరిప్రసాద్ మౌనంగానే ఉన్నారు. నోటీసులకు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా హరిప్రసాద్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కీలక పదవుల్లో పార్టీ తరపున పనిచేశారు. విధాన పరిషత్లో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ మధుబంగారప్పకు కులసంఘాల కారణంగా మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి సీఎంపై హరిప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూచనలు ఇచ్చేందుకు డీకే శివకుమార్ను చర్చలకు ఆహ్వానించినట్లు సమాచారం. మరికొద్ది నెలల్లో రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించవద్దని సూచించినట్లు సమాచారం. ఈ చర్చల్లో పౌర ఆహార సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప కూడా పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-29T08:06:16+05:30 IST