ఎన్డీయే నుంచి ఏఐఏడీఎంకే వైదొలగిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఆదివారం ఢిల్లీ వెళ్లారు.

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఎన్డీయే నుంచి ఏఐఏడీఎంకే వైదొలగిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఆదివారం ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చడం, తత్ఫలితంగా కూటమి నుంచి అన్నాడీఎంకే వైదొలగడంపై బీజేపీ జాతీయ నేతలతో చర్చించనున్నారు. ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే వైదొలగడంపై బీజేపీ రాష్ట్ర నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం వహిస్తున్నారు. అన్నాడీఎంకేతో పొత్తుకు పార్టీ అధిష్టానం ప్రయత్నించే అవకాశం ఉన్నందునే అన్నాడీఎంకేపై ఆ పార్టీ నాయకత్వం విమర్శలు చేయడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్నామలై ఆదివారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. అన్నాడీఎంకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చినా నష్టం లేదని, రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రత్యేక ఓటు బ్యాంకు క్రమంగా పెరుగుతోందని ఇప్పటికే అన్నామలై నాయకత్వానికి నివేదించామని స్థానిక నేతలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఒకటి రెండు సీట్ల కోసం అన్నాడీఎంకే నేతలతో పోట్లాడడం కంటే ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం మంచిదని అన్నామలై భావిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఓటు బ్యాంకు ఉన్న పీఎంకే, డీఎండీకేలతో కొత్త కూటమిగా ఏర్పడి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని అన్నామలై కులస్తుల నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే తన ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే పాదయాత్ర చేస్తున్నట్టు అన్నామలై వివరిస్తున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశమై అన్నాడీఎంకే నుంచి వైదొలగడానికి గల కారణాలను వివరించడంతో పాటు అక్టోబర్ 3న పార్టీ జిల్లా శాఖల నేతల సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సూచనలు కూడా తీసుకోనున్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-01T08:02:06+05:30 IST