మణిపూర్ వాసులు దేనికి భయపడుతున్నారు.
ప్రధానిపై రాహుల్ విమర్శలు.. మిజోరంలో పాదయాత్ర
ఐజ్వాల్, అక్టోబర్ 16: ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఏళ్ల తరబడి తీవ్ర ఉద్రిక్తతలతో రగులుతున్న మణిపూర్ సమస్యను ఏమాత్రం పట్టించుకోని ప్రధాని.. ఎక్కడో ఇజ్రాయెల్ లో జరుగుతున్న పరిణామాలకు తెగ బాధపడిపోతున్నారని దుయ్యబట్టారు. ఈ ఏడాది మే నుంచి మణిపూర్లో దారుణాలు జరుగుతున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో సోమవారం నుంచి రెండు రోజుల పాటు రాహుల్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మిజోరం రాజధాని ఐజ్వాల్లో ఆయన పాదయాత్ర చేపట్టారు. మిజోరం పొరుగు రాష్ట్రమైన మణిపూర్ ఇప్పుడు కులాల ప్రాతిపదికన రెండుగా విడిపోయిందని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. మిజోరం రాజధాని ఐజ్వాల్లోని చన్మారి జంక్షన్ నుంచి సోమవారం ఉదయం రాహుల్ పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాహుల్కు స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం 4 నుంచి 5 మీటర్లు నడిచి రాజ్ భవన్ వద్ద పాదయాత్ర ముగించారు.
39 మందితో కాంగ్రెస్ జాబితా
40 స్థానాలున్న మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 7న పోలింగ్ జరగనుంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం 39 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర పీసీసీ చీఫ్ లాల్ స్వతకు ఐజ్వాల్ వెస్ట్-3 ఎస్టీ రిజర్వ్ డ్ సీటు కేటాయించారు. అదేవిధంగా మరో ముఖ్య నేత లాల్ నున్మావియా చువాంగోకు ఐజ్వాల్ నార్త్-1 ఎస్టీ రిజర్వ్డ్ సీటు కేటాయించారు.
కేంద్రం చౌకబారు వ్యూహం: జైరాం రమేష్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన ప్రచారానికి సైన్యాన్ని ఉపయోగించుకోవాలనే చౌకబారు వ్యూహాన్ని ఉపయోగిస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు. కేంద్ర పథకాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు సైన్యం సహకరిస్తుందన్న వార్తలపై రమేష్ ఘాటుగా స్పందించారు. సైన్యం అందరికీ సంబంధించిన శాఖ అని, దేశ అంతర్గత రాజకీయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోవద్దని వ్యాఖ్యానించారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-17T02:58:00+05:30 IST