కోల్కతా: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను వధిస్తూ పరుగుల వరద కురిపిస్తున్నాడు. ఈ టోర్నీలో రెండు సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లోనూ కోహ్లి రెచ్చిపోయాడు. అజేయ సెంచరీతో దుమ్మురేపాడు. ఆదివారం కూడా కోహ్లీ పుట్టినరోజు. దీంతో కోహ్లీ సెంచరీ సాధించి తన పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా చేసుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి 11 రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రికార్డుల రారాజు అనిపించుకున్నాడు.
49- దక్షిణాఫ్రికాపై వన్డే ఫార్మాట్లో కోహ్లీకి 49వ సెంచరీ. దీంతో ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. సచిన్ కంటే వేగంగా 49 సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టించాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోహ్లి తన తొలి వన్డే సెంచరీతో పాటు 49వ వన్డే సెంచరీని కూడా నమోదు చేయడం గమనార్హం.
50- వైట్ బాల్ క్రికెట్ అంటే వన్డేలు, టీ20ల్లో కలిపి కోహ్లీకి ఇది 50వ సెంచరీ. దీంతో వైట్ బాల్ క్రికెట్లో 50 సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్మెన్గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ వన్డేల్లో 49 సెంచరీలతో పాటు టీ20ల్లో కూడా సెంచరీ సాధించాడు.
3- ఈ మ్యాచ్లో సాధించిన పరుగులతో కోహ్లి ప్రపంచకప్లో 1,500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానానికి చేరుకున్నాడు.
119- వన్డే ఫార్మాట్లో కోహ్లీకి సెంచరీ 119వ 50+ స్కోరు కావడం గమనార్హం. దీంతో వన్డేల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర (118) రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 145 సార్లు 50+ స్కోర్లు సాధించాడు.
5- వన్డేల్లో దక్షిణాఫ్రికాపై కోహ్లికి ఇది ఐదో సెంచరీ. దీంతో ఈ ఫార్మాట్లో దక్షిణాఫ్రికాపై అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్ల రికార్డును కోహ్లీ సమం చేశాడు.
7- అంతర్జాతీయ క్రికెట్లో పుట్టిన రోజున సెంచరీ చేసిన ఏడో బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత్కు మూడో ఆటగాడు. ప్రపంచకప్లో పుట్టిన రోజున సెంచరీ సాధించిన మూడో ఆటగాడు. మొత్తానికి సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, సనత్ జయసూర్య, రాస్ టేలర్, టామ్ లాథమ్, మిచెల్ మార్ష్ లు తమ పుట్టినరోజున కోహ్లీ కంటే ముందు సెంచరీలు సాధించారు.
22- వన్డేల్లో తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీకి ఇది 22వ సెంచరీ. దీంతో వన్డేల్లో తొలి బ్యాటింగ్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ (22)తో సమంగా నిలిచాడు.
6046- ఈ మ్యాచ్లో చేసిన పరుగుల ద్వారా కోహ్లీ స్వదేశంలో వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేశాడు. దీంతో స్వదేశంలో అత్యంత వేగంగా ఈ మార్క్ను అందుకున్న బ్యాట్స్మెన్గా నిలిచాడు.
1- ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. వన్డే ఫార్మాట్లో కోహ్లీకి ఇది 41వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు.
55- అంతర్జాతీయ క్రికెట్లో తమ జట్టు గెలిచిన మ్యాచ్ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్తో కలిసి విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ తమ తమ జట్లు గెలిచిన మ్యాచ్ల్లో 55 సెంచరీలు నమోదు చేశారు.
3058- విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై అన్ని ఫార్మాట్లలో కలిపి 3000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఇప్పటివరకు, కోహ్లి దక్షిణాఫ్రికాతో అన్ని ఫార్మాట్లలో కలిపి 58 మ్యాచ్లలో 3,058 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో దక్షిణాఫ్రికాపై విరాట్ 1,500 పరుగులు పూర్తి చేశాడు.
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో ఆ జట్టు గెలుస్తుందని అనుకున్నా.. ప్రత్యర్థి ఇంత దారుణంగా ఆడుతుందని ఎవరూ అనుకోలేదు. తొలుత బ్యాటింగ్లోనూ, ఆ తర్వాత బౌలింగ్లోనూ టీమిండియా అదే ప్రదర్శన చేయడంతో సఫారీలతో మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఓపెనింగ్లో తమ బలహీనతను పునరావృతం చేస్తూ 243 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ తొలి 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్) సెంచరీ చేయగా, శ్రేయాస్ (87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77) అర్ధ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ (24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) శుభారంభం అందించగా, జడేజా (15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ తో 29 నాటౌట్ ), సూర్యకుమార్ (14 బంతుల్లో 5 ఫోర్లతో 22) విజృంభించారు. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. జాన్సెన్ (14) టాప్ స్కోరర్. డుసెన్, బావుమా, మిల్లర్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జడేజా (5/33) ఐదు వికెట్లు తీయగా, కుల్దీప్ (2/7), షమీ (2/18) రెండేసి వికెట్లు తీశారు. కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
నవీకరించబడిన తేదీ – 2023-11-06T09:17:34+05:30 IST