బుధవారం పార్లమెంటులో ఇద్దరు దుండగులు సృష్టించిన హంగామా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లోక్సభలోని సందర్శకుల గ్యాలరీ నుంచి ఇద్దరు దుండగులు దూకి పసుపు రంగు గ్యాస్ డబ్బాలతో వీరంగం సృష్టించారు.
పార్లమెంట్ భద్రతకు విఘాతం: బుధవారం ఇద్దరు దుండగులు పార్లమెంటులో సృష్టించిన హంగామా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లోక్సభలోని సందర్శకుల గ్యాలరీ నుంచి ఇద్దరు దుండగులు దూకి పసుపు రంగు గ్యాస్ డబ్బాలతో వీరంగం సృష్టించారు. ఈ ఘటనతో భారీ భద్రతా లోపాన్ని బట్టబయలు చేసింది. వారు ఎలా ప్రవేశించారు? ఆ గ్యాస్ క్యాన్లను ఎలా తీసుకొచ్చారు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓ ఎంపీ ద్వారా వారికి విజిటర్ పాస్లు అందినట్లు సమాచారం.
ఇంతకీ ఈ విజిటర్ పాస్ అంటే ఏమిటి?
లోక్సభ హ్యాండ్బుక్ ప్రకారం.. పార్లమెంటు సభ్యుల (ఎంపీ) అతిథులకు ఈ విజిటర్ పాస్ జారీ చేయబడుతుంది. సెంట్రలైజ్డ్ పాస్ ఇష్యూ సెల్ (CPIC)లో అందుబాటులో ఉన్న పసుపు దరఖాస్తు ఫారమ్ల ద్వారా ఒక రోజు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. ఫారమ్లో పూర్తి పేరు, తండ్రి/భర్త పేరు, వయస్సు, జాతీయత, పాస్పోర్ట్ నంబర్ (ఇది విదేశీ సందర్శకులకు మాత్రమే వర్తిస్తుంది), వృత్తి వివరాలు, MP తరపున అతిథుల (శాశ్వత) చిరునామాను కలిగి ఉండాలి. అంతేకాకుండా, నిర్దిష్ట సందర్శకుడి గురించి తనకు బాగా తెలుసునని మరియు అతనికి పూర్తి బాధ్యత ఉందని పేర్కొంటూ MP ఒక ధృవీకరణ పత్రాన్ని కూడా అందించాలి.
హ్యాండ్బుక్ ప్రకారం.. విజిటర్స్ కార్డ్ దరఖాస్తులో నలుగురి కంటే ఎక్కువ అతిథుల పేర్లు ఉండకూడదు. అదేంటంటే.. ఒక్కో ఎంపీకి నలుగురు చొప్పున సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు. అలాగే.. కార్డును తీసుకోవడానికి సందర్శకులు ముందు రోజు సాయంత్రం 4 గంటలలోపు CPICకి చేరుకోవాలి. సందర్శకుల కార్డ్ కోసం CPIC వద్ద రెడ్ ఫారమ్లు అదే రోజు దరఖాస్తులపై కొన్ని షరతులకు లోబడి జారీ చేయబడతాయి. ఒకవేళ ‘ఒకే రోజు’ పాస్లు జారీ చేయాలంటే, పార్టీ అధికారం కలిగిన డిప్యూటీ లీడర్ లేదా పార్టీ విప్ దరఖాస్తు ఫారమ్లో అదే రోజు పాస్లను సిఫార్సు చేయాలి. సందర్శకుడి ఉద్దేశాన్ని సంబంధిత జాయింట్ సెక్రటరీకి కూడా తెలియజేయాలి.
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 14, 2023 | 04:20 PM