బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో సమావేశమైన ప్రధాని మోదీ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు

బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు
‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ చర్చల పురోగతిపై సమీక్ష
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో సమావేశమైన ప్రధాని మోదీ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)పై ఇప్పటి వరకు జరిగిన చర్చల పురోగతిని వారు సమీక్షించారు. మిగిలిన అంశాలు కూడా పరిష్కారమయ్యాయని, త్వరలోనే సమతుల్యతతో కూడిన ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన రిషి సునక్ గతేడాది అక్టోబర్లో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై భారత్కు రావడం ఇదే తొలిసారి. ఆయన శుక్రవారం ఢిల్లీకి చేరుకోగా, శనివారం జరిగిన జి20 సదస్సు తొలి సెషన్ తర్వాత మోదీ, రిషి సునక్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. బ్రిటన్ ప్రధానితో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు పెట్టుబడులను పెంచే మార్గాలపై చర్చించినట్లు మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. ‘భారత్-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’, రోడ్మ్యాప్ 2030 ప్రకారం ఆర్థిక, రక్షణ, భద్రత, సాంకేతికత తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ద్వైపాక్షిక సమావేశంపై ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మంత్రులు, అధికారుల బృందాల చర్చలను వేగవంతం చేసేందుకు ఇరువురు నేతలు అంగీకరించారని పేర్కొంది. జీ20 సదస్సుకు హాజరైన జపాన్ ప్రధాని కిషిదా, ఇటలీ ప్రధాని మెలోనిలను కూడా మోదీ కలుసుకుని ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-10T05:10:05+05:30 IST